ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 6: మండలంలో కొంతకాలంగా సీనియర్స్, జూనియర్స్గా బీజేపీ కార్యకర్తలు విడిపోవడంతో రోజురోజుకూ పార్టీలో ముసలం ముదురుతోంది. ఇటీవల జిల్లా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలతో జిల్లాలోని కొన్ని మండలాల అధ్యక్షులు బాహాటంగానే విమర్శలు చేస్తుండడం తమకు విలువ లేని చోట కొనసాగలేమని గంటాపథంగా చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల మండలానికి చెందిన కొందరు కార్యకర్తలు పలు సోషల్మీడియా గ్రూపుల్లో జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తూ పలు విమర్శలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క నిరసన కార్యక్రమానికి హాజరుకాకుండా పార్టీని నిర్వీర్యం చేసే కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ సోషల్ మీడియా గ్రూపులో పోస్టులు చేస్తున్నారు. దీంతో జిల్లా అధ్యక్షుడి అనుకూల వర్గం మండల కేంద్రంలో ప్రెస్మీట్ పెట్టి జిల్లా అధ్యక్షుడిపై సోషల్ మీడియా పోస్టులు సరికావని మండలాధ్యక్షుడి గ్రూపు అనుకూల వర్గాన్ని హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం మండలంలో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మండలాధ్యక్షుడికే సమాచారం లేకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దీంతో మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి తమ కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్కు ఎలాంటి సంబంధం లేదని పత్రికా ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. పొన్నాల తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మరి కొందరు సమర్థిస్తూ మద్దతు పలుకడంతో సెస్ ఎన్నికలున్నాయి.. వివాదాలు వద్దంటూ.. కొందరు ఇరువర్గాలను సమన్వయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరికి వారుగా తగ్గేదేలే.. అంటూ పోటాపోటీ కార్యక్రమాలు చేస్తుండగా పార్టీలో లుకలుకలు బయట పడుతున్నాయి.