విద్యానగర్, డిసెంబర్ 6: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒకరూ కంకణబద్ధులు కావాలని కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ అబ్ స్ట్రెట్రిక్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఫాగ్సీ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన నుంచి మహిళా వైద్యులు, సిబ్బందితో కలిసి ఎంసీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, పని ప్రదేశంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులు వంటి ఘటనలను ఉపేక్షించవద్దన్నారు. మహిళల రక్షణ కోసం షీటీంలు నిరంతరం పనిచేస్తున్నాయని చెప్పారు. ఎవరైనా మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. యువతులు, మహిళలు ఎల్లవేళలా చురుకుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, ఫాగ్సీ బాధ్యులు డాక్టర్ చంద్రమతి, కొల్లూరి రాధ, కాసం నీలిమ, ఆది శ్రీదేవి, పొలాస మాధవి, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.