కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధుల బృందం కితాబు
రామడుగు : పచ్చదనం, పరిశుభ్రతలో కరీంనగర్ జిల్లా ముందువరుసలో ఉంటుందని, అభివృద్ధిలో వెలిచాల గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధుల బృందం కొనియాడింది.
రామడుగు మండలం వెలిచాల గ్రామాన్ని జిల్లా స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సర్పంచ్ వీర్ల సరోజన ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి కోలాటాలతో సాదర స్వాగతం పలికారు. ఇందులో భాగంగా రోడ్లు, మురుగు నీటి కాలువలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలో ఎన్ని ఇంకుడుగుంతల నిర్మాణం జరిగిందని పాలకవర్గాన్ని ప్రశ్నించగా సుమారు 808 పూర్తి కాగా మరో 153 ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.
అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళా సంఘాల సభ్యులు, సర్పంచ్తో కలిసి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కేంద్ర బృందం సభ్యులు బతుకమ్మ ఆడారు. తెలంగాణతల్లి కూడలిలో బతుకమ్మ ఎత్తుకొని సందడి చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ బృందం ప్రతినిధులు మాట్లాడుతూ మొక్కలు నాటి రక్షించడంలో, పారిశుధ్య నిర్వహణలో కరీంనగర్ జిల్లా ముందంజలో ఉందన్నారు.
ముఖ్యంగా వెలిచాల గ్రామం స్వచ్ఛత, సామాజిక అభివృద్ధిలో రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దిన సర్పంచ్ వీర్ల సరోజనతో పాటు పారిశుధ్య కార్మికులకు కేంద్రం బృందం సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీవ్ జువారి, జలశక్తి శాఖ సభ్యురాలు అనీషా దేహీ, యునిసెఫ్ రాష్ట్ర ప్రతినిధి చంద్రశేఖర్, స్వచ్ఛభారత్ మిషన్ రాష్ట్ర ప్రతినిధి శ్రావ్య, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా స్వచ్ఛ భారత్ కో-ఆర్డినేటర్ కిషన్స్వామి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు, పంచాయతీ కార్యదర్శి సరిత, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.