సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ఠ వేగాన్ని పెం చుతూ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ట్రాక్ మరమ్మతులపై దృష్టి కేంద్రీకరించడం, అ త్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలైన చోట్లలో గరిష్ఠ వేగాన్ని పెంచడం కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
అందులో భాగంగా జోన్ పరిధిలో ఉన్న గోదావరిపై ఉన్న గోదావరి-కొవ్వూరు స్టేషన్ల మధ్య ఉన్న గోదావరి ఆర్చ్ వంతెనపై నడిచే రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలో మీటర్ల వరకు పెంచామన్నారు. గతంలో అంటే 2015 నుంచి ఏప్రిల్ 2022 వరకు గోదావరి వంతెనపై 30 కిలో మీటర్ల వేగం ఉండేదని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో గరిష్ఠ వేగాన్ని 40 కిలో మీటర్లకు పెంచామని, అందులో భాగంగా ప్రస్తుతం వేగాన్ని 50 కిలో మీటర్లకు పెంచినట్లు తెలిపారు. గోదావరి-కొవ్వూరు స్టేషన్ల మధ్య దూరం ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందని, ప్రయాణికుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు కూడా 50 కిలోమీటర్ల వేగంతో గోదావరి వంతెనపై ప్రయాణించేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.