వేములవాడ, డిసెంబర్ 2: జోన్లవారీగా ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించే సమయంలో ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు జోన్లుగా ఉన్న రాష్ట్రంలో ఏడు జోన్లు కాగా రెండు మల్టీజోన్లుగా ఏర్పడ్డాయన్నా రు. వీటిపై ఉద్యోగుల్లో అనేక అపోహలు ఉన్నాయని, బదిలీ క్రమంలో తప్పనిసరిగా జిల్లాల వారీగా ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులతో ఫ్రెండ్లీ సీఎంగా వ్యవహరిస్తున్నారని కొనియడారు. ఇందులో భాగంగానే పీఆర్సీ కోరిన విధంగా అమలు చేశారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించారని, పీఆర్సీ నివేదికలో ఉద్యోగుల మూల వేతనంలో ఒక్కశాతం నిధులను ప్రభుత్వ సహాయనిధికి అందించాలని సూచించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని అమలు చేయాలని ఆదేశించినా ఇప్పటివరకు అధికారులు కార్యరూపం దాల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఈహెచ్ఎస్ ద్వారా సాలీనా రూ. 450 కోట్లు, మూలవేతనం ద్వారా రూ.360 కోట్లతో కలిపి రూ.810కోట్లు ప్రభుత్వ సహాయనిధికి చేరనున్నాయన్నారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కూడా కలిసి విన్నవించామన్నారు. త్వరలోనే ఆర్థిక, వైద్యారోగ్యశాఖ, ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి విధి విధానాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించినప్పటికి అధికారులు కొందరు ప్రెసిడెన్సీ ఉత్తర్వులను అడ్డుగా చూపి మోకాలు అడ్డుగా పెడుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే రావాల్సిన 4డీఏలు, పదోన్నతుల వ్యవహారం, జోన్లవారీగా బదిలీల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరిస్తామని చెప్పారు. కోరుకున్న పీఆర్సీ అమలుపై వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నామని వారు చెప్పారు. టీఎన్జీవో కరీంనగర్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎల్సాని ప్రవీణ్కుమార్, రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, నాయకులు దారం శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్ తదితరులున్నారు.