బీజేపీ నేతలు.. రాష్ట్ర రైతులతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై రోజుకో వైఖరి.. రెండు నాల్కల ధోరణితో ఆగం పట్టిస్తున్నారు. గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో మరో మాటతో రెచ్చగొడుతున్నారు. అంతా కేంద్రమే కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందంటూ ఇన్నాళ్లూ ఊదరగొట్టిన ఆ నాయకులు, ఇప్పడు నోరుమెదపడం లేదు. తెలంగాణ ధాన్యం కొంటరా..? కొనరా..? అంటూ టీఆర్ఎస్ ఎంపీలు మూడు రోజుల నుంచి పార్లమెంట్ సాక్షిగా ఒంటరి పోరాటం చేస్తున్నా.. కనీస మద్దతు తెలుపకుండా చోద్యం చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు అదే బాటలో పయనిస్తూ.. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న రైతులు బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపైమండిపడుతున్నారు. రైతు గోసను పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం సరికాదని, టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిలదీయాలని హితవు పలుకుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఇంకా రైతుల జీవితాలతో ఆటాడుతూనే ఉన్నది. యాసంగి పంటను కొనబోమని ఢిల్లీ లీడర్లు ఖరాకండిగా చెప్పినా.. రాష్ర్టానికి లేఖ కూడా రాసినప్పటికీ గల్లీ పార్టీ మాత్రం తొండి రాజకీయం చేస్తున్నది. రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ తమ స్వలాభం కోసం వరి వేయాలని రైతులను రెచ్చగొడుతున్నది. మూడు రోజులుగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తుంటే.. సపోర్ట్ చేసేది పోయి కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తమాషా చూస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని, తమపై ప్రేమ ఉన్నట్లు ఇక్కడ నటించి, అక్కడ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై రైతులు మండిపడుతున్నారు.
-కరీంనగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీజేపీ ద్వంద్వ వైఖరి
రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఇక్కడి జేపీ నాయకులు చెబుతున్నారు. గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇంకా బియ్యం సేకరణ చేయలేదు. తాజా రబీ సీజన్లోనూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో వడ్లు కొంటారా? కొనరా? అనే ఒకే ఒక ప్రశ్నను కేంద్రానికి సందిస్తూ.. మూడు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా పోరాడుతున్నారు. వివిధ రకాల నిరసనలు చేస్తున్నారు. అయినా.. కేంద్రం నుంచి నేటి వరకు ఎటువంటి స్పందనా రా లేదు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం తలాతోక లేని మా టలు మాట్లాడుతున్నారు. వచ్చే యాసంగిలోనూ వరి వే యిండ్రి.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనుగోలు చేయిసామంటూ ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. గల్లీలో ఈయన ఇలా మాట్లాడితే.. ఢిల్లీలో మాత్రం.. యాసంగిలో ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నా.. పోరాటం చేస్తున్నా నేటివరకు సమాధానం లేదు.
గల్లీలో వేరు.. ఢిల్లీలో వేరు
రైతులపై అపారమైన ప్రేమ ఉన్నట్లు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్ కపట నాటకాలు తాజాగా బయట పడ్డాయి. మూడు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు ఒంటరి పోరు చేస్తున్నా.. ఏ పార్టీ నాయకులు కలిసి రావడం లేదు. కనీసం కాంగ్రెస్ కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వడం లేదు. స్థానికంగా మాత్రం చాలా మాటలు చెపుతున్నారు. ధాన్యం కొనాల్సిందే అంటూ పదే పదే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్వయంగా ఎంపీ అయి ఉండి కూడా రైతులకోసం పోరుబాట బట్టిన టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం లేదు. కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. ఇక బీజేపీ నాయకులు మాత్రం.. ఈ విషయం తమది కాదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో.. రైతులపై ఆ రెండు పార్టీలు చూపుతున్న కపట ప్రేమ బయట పడింది.
అన్నీ అబద్ధాలే..
యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం అప్పట్లోనే రాష్ర్టానికి లేఖ కూడా రాసింది. ఆ లేఖను గత నవంబర్ 7న సీఎం కేసీఆర్ స్వయంగా విలేకరులకు అందజేశారు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాత్రం రైతులను వరి వేయాలని రెచ్చగొడుతున్నడు. ఇంకా తెలంగాణలో ఎక్కడా 62లక్షల ఎకరాల్లో వరి సాగైతలేదని దుష్ప్రచారం చేస్తున్నడు. కానీ తెలంగాణలో 2021-22 వానకాలంలో సుమారు 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని కేంద్రంలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్, ఫార్మర్స్ వెల్ఫేర్’ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా తేల్చింది. ఇలా నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
మండిపడుతున్న రైతులు
రాజ్యాంగం ప్రకారం వ్యవసాయరంగానికి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు అంటే విద్యుత్, సాగునీరు వంటి మౌళిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. అందులో తెలంగాణ దేశానికే ఒక దిక్సూచిగా నిలిచింది. కావాల్సినన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసి అన్నదాతలకు నీళ్లు ఇచ్చింది. దేశంలో ఎకడా లేని విధంగా రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇచ్చింది. అయితే.. రైతులు పండిచిన పంటకు మద్దతు ధరతో పాటు వాటిని కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్రానిదే. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. వండ్లు కొనమంటూ మొండికేస్తుంది. ఈ వ్యవహారంపై రైతులు, రైతు సంఘాల నాయకులు మండి పడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల వైఖరిని తూర్పార పడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యలపై పోరు చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు పలుకాలని డిమాండ్ చేస్తున్నారు.
వడ్లు కొనాలె అని కొట్లాడాలె..
ఊళ్లలకు వచ్చి వరి పండించాలె.. అని చెబుతున్న బీజేపీ ఎంపీలు యాసంగిల వడ్లు కొంటమని కేంద్రం నుంచి జీవో తేవాలె. తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతున్నరు. రైతు వ్యతిరేక విధానాలతో రైతులను కష్టాలపాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా టీఆర్ఎస్ ఎంపీలు వెనక్కి తగ్గద్దు. రైతు సంక్షేమం కోసం పోరాడుతున్న ఎంపీలకు యావత్ తెలంగాణ రైతాంగం అండగా ఉంటది.వేరే రాష్ర్టాలకు ఓ న్యాయం, తెలంగాణకు ఓ న్యాయమా?. యాసంగిల వడ్లు కొంటరా? లేదా? తేల్చి చెప్పేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టద్దు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రైతుల పక్షాన పోరాడకుంటే గుణపాఠం చెబుతం.
రైతుల మీద ప్రేమ ఎంతున్నదో తెలుస్తంది
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ ఎంపీలు లోక్సభలో మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. మూడు రోజుల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు అదే పనిగా ధర్నా చూస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు మౌనంగా ఉటున్నరు. వారి వైఖరి చూస్తే రైతుల పట్ల వారికి ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తంది. బీజేపీ ఎంపీలు కేంద్రంతో ధాన్యం కొంటామని ఎందుకు చెప్పియ్యరు. టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి బీజేపీ ఎంపీలు మద్దతుగా నిలువాలె.