ఆర్మూర్, మే 21 : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేరళ రాష్ట్రంలో అమలుచేయాలని దక్షిణ భారత రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు తీర్మానించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న జూబ్లీ యానిమేషన్ సెంటర్లో దక్షిణ భారతదేశ రైతు సంఘాల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ వ్యవస్థాపకుడు శివకుమార్ కక్కాజి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్రావు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సాయేందర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తదితర వాటిని కేరళ రాష్ట్రంలో అమలుచేయాలంటూ డిమాండ్ చేస్తూ తీర్మానించారు.
తీర్మాన కాపీని కేరళ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రికి పంపించారు. కేరళలోని రైతులను సమీకరించి పథకాల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. కేరళలోని ఆదివాసీ ప్రాంతాల్లో వన్యమృగాలు పంటలపై దాడి చేయడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, వన్యమృగాల నుంచి పంటలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడడానికి అడవి పందులను చంపడం నేరం కాదని ప్రభుత్వం జారీచేసిన జీవోను రైతు నాయకులకు కోటపాటి నర్సింహానాయుడు వివరించారు.
కేరళలోని మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆదానీ కంపెనీకి పోర్ట్ను కేటాయించడాన్ని రైతునాయకులు ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న మోడల్ రైతు పథకాలను అమలు చేయాలని కోరుతూ కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల సీఎంలను కలిసినట్లు రైతు సంఘాల నాయకులు వివరించారు. తదుపరి రైతు సంఘాల సమావేశాన్ని మహారాష్ట్రలో నిర్వహించనున్నట్లు నిర్ణయించామని కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు.