డిచ్పల్లి, మే 21: ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు బహిర్గతమవగా, ఇద్దరు ఏపీవోలపై సస్పెన్షన్ వేటుపడింది. డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద 2019 నుంచి 2022 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను శనివారం నిర్వహించారు. డీఆర్డీవో చందర్ నాయక్, జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ, స్టేట్ రిసోర్స్ పర్సన్ మహేశ్, ఉపాధిహామీ ఆడిట్ సభ్యులు హాజరయ్యారు. మేజర్ పంచాయతీ నడిపల్లి గ్రామంలో జరిగిన ఉపాధిహామీ పనుల వివరాలను సభలో చదివి వినిపించగా.. సుమారు రూ.74 లక్షలకు సంబంధించిన ఎంబీ రికార్డులు, మస్టర్లు లేకపోవడంతో డీఆర్డీవో చందర్నాయక్ అవాక్కయ్యారు. ఎంబీ రికార్డులు లేకుండానే బిల్లులు ఎలా చెల్లిస్తారని ఏపీవోలు మంజుల, ఓంకార్ను ప్రశ్నించారు.
స్థానిక అధికారులపై మండిపడ్డారు. రికార్డులు, మస్టర్లు, అధికారుల సంతకాలు లేకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారని ఏపీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఒక చోట జరిగితే మరొక చోట పనులు జరిగినట్లు ఎంబీలు రికార్డు చేయడంపై సిబ్బందిపై మండిపడ్డారు. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు కార్యాలయానికి పరిమితం కావడంతో మేట్లు వారి ఇష్టంవచ్చిన వారికి హాజరువేస్తూ మస్టర్లలో పేర్లు నమోదు చేసి దొంగ సంతకాలు చేసి బిల్లులు చెల్లించారని స్పష్టంగా అర్థమవుతున్నదని స్టేట్ రిసోర్స్పర్సన్ మహేశ్ సభలో ప్రకటించారు. దీంతో ఏపీవోలు ఓంకార్, మంజులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఆర్డీవో ప్రకటించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ సరిగ్గా చేపట్టలేదన్నారు. చాలా చోట్ల పనులు చేసిన ప్రాంతాలకు ఏపీవో గానీ, టీఏలు వెళ్లకుండానే మేట్లను పంపి కొలతలు చేపట్టి బిల్లులు చెల్లించి చేతులు దులుపుకొన్నట్లు క్షేత్రస్థాయి సామాజిక తనిఖీలో వెల్లడైందని వివరించారు.
మండలంలో రూ. 16 కోట్ల పనులు జరిగితే సుమారు రూ. 4 కోట్లకు సంబంధించి ఎంబీ రికార్డులు, మస్టర్లు లేవని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించినట్లు సమాచారం. పూర్తిస్థాయి వివరాలు సోమవారం సాయంత్రం వరకు అందే అవకాశం ఉంది. శనివారం ఉదయం ప్రారంభమైన ప్రజావేదికలో సాయంత్రం వరకు రెండు గ్రామ పంచాయతీలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 30 గ్రామాలకు సంబంధించిన పనుల వివరాలు ఇంకా ప్రజావేదికలో తేలాల్సి ఉన్నది. నడిపల్లిలో ఓ మహిళ మరణిస్తే.. ఆమె కూడా ఉపాధి హామీ పనులు చేసినట్లు మస్టర్లలో సంతకాలు చేసి సైతం డబ్బులు చెల్లించినట్లు ఆడిట్లో గుర్తించారు. ప్రజావేదికలో ఎంపీపీ గద్దెభూమన్న, వైస్ ఎంపీపీ శ్యాంరావు, ఎంపీడీవో నాగేంద్రప్ప, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.