కామారెడ్డి జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కరోనా నివారణకు టీకా ఒక్కటే మార్గం కావడంతో ఆ దిశగా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని 211 గ్రామాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 276 కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లేవారి సౌకర్యార్థం.. రాత్రివేళల్లోనూ వారి ఇండ్ల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు.
కామారెడ్డి, డిసెంబర్ 14 : కామారెడ్డి జిల్లాలో కొ విడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వందశాతం లక్ష్యం సాధించే దిశగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీకాల పంపిణీని వేగవంతం చే సింది. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రజల్లో అవగాహన పెరగడంతో టీకాలు వే సుకునేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,93,331 మంది మొదటి డోసు, 3,39,745 మంది రెండో డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సినేషన్ కోసం 276 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు రాకపోయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా టీకాలు వేస్తున్నారు. వంద శాతం లక్ష్యం సాధించే దిశగా అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. జిల్లాలో మొత్తం 7లక్షల 36వేల మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రేషన్ దుకాణాలు, కమ్యూనిటీ వార్డులు, కాలనీల్లో ప్రత్యేక సెంటర్ల ద్వారా టీకాలు అందిస్తున్నారు. మొదటి డోసు వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టారు.
18 ఏండ్లు నిండిన వారందరికీ..
జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరికీ డిసెంబర్ 15వ తేదీ వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కామా రెడ్డి జిల్లాలో 10 లక్షల 79వేల 3 వందల 92 జనాభా ఉంది. ఇందులో 7,38,656 మంది 18 ఏండ్లు పైబడిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 9,33,076 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. మొదటి డోసు 5,93,331 మంది వేసుకోగా 82 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. రెండో డోసు 3,39,745 మంది వేసుకోగా 47 శాతం పూర్తయ్యింది.
రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంట ర్, రాజంపేట, సదాశివనగర్, దేవునిపల్లి పీహెచ్సీలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందు వరుసలో ఉన్నాయి. 211 గ్రామాల్లో వందశాతం టీకాల పంపిణీ పూర్తయ్యింది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో వైద్యారోగ్య సిబ్బందితో పాటు అంగన్ వాడీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, మెప్మా, ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు ఇంటింటా సర్వే చేసి టీకాల పంపిణీ చేపడుతున్నారు. గతంలో మాదిరిగా వ్యాక్సిన్ కొరత లేకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిందని, మొదట్లో టీకాపై అపోహలతో ముందుకు రాని వారు ప్రస్తుతం నేరుగా టీకాలు వేయించుకుంటున్నారు.
18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్
18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఏర్పాటు చేసిన 247 సెంటర్లతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రేషన్ దుకాణాల వద్ద టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్పై ముమ్మర ప్రచారం చేశాం. 211 ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.
-చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి
ముమ్మరంగా వ్యాక్సినేషన్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చే ప్రమాదం ఉన్నందున 18 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు చేపట్టాం. గ్రామాలు, పట్టణాల్లో టీకాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి. కొవిడ్ నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని గుర్తించాలి.