కోటగిరి, అక్టోబర్ 22. రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సేవలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ముందుండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్పర్సన్గా తేళ్ల లావణ్య అరవింద్, వైస్ చైర్మన్గా జగన్తో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో పాటు నీటి సమస్యతో రైతులు నానా కష్టాలు పడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించారని తెలిపారు. 24 గంటల పాటు ఉచిత విద్యు త్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని అన్నారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందన్నారు. రైతులకు విద్యుత్ సమస్య ఉండకూడదని కోటగిరిలో కొత్తగా రూ.20 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఏఎంసీ, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్పీకర్ పోచారం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ శంకర్పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తేళ్ల లావణ్య , మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, వైస్ ఎంపీపీ గంగాధర్, డీసీవో సింహాచలం, ఆర్డీవో రాజేశ్వర్, డీఏవో గోవింద్, విండో చైర్మన్లు శాంతేశ్వర్పటేల్, కూచి సిద్దూ, అశోక్పటేల్, శివరాజ్దేశాయ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, కిశోర్బాబు తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్లో..
రుద్రూర్, అక్టోబర్ 22: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీ పీ నట్కరి సాయిలు, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, రైతులు పాల్గొన్నారు.