మొన్న నియోజకవర్గాల్లో రైతు దీక్షలు.. నిన్న రాష్ట్ర రాజధానిలో మహాధర్నా.. నేడు దేశ రాజధానిలో అన్నదాతకు అండగా పోరుబాట.. తెలంగాణ రైతాంగం పక్షాన టీఆర్ఎస్ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. కేంద్రం వైఖరిపై పార్లమెంటులో గులాబీదళం గళమెత్తింది. నిలదీతలు, నిరసనలతో సెగ పుట్టిస్తున్నది. యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించే ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం నిరసన తెలిపారు. బీజేపీ రెండు నాల్కల ధోరణితోపాటు కేంద్ర ప్రభుత్వం నాన్చుడు విధానాన్ని ఎండగడుతూ ఎంపీలు చేస్తున్న ఆందోళన తెలంగాణ ఉద్యమరోజుల్ని గుర్తుచేసింది. బీజేపీ రెండు నాల్కల ధోరణి, కాంగ్రెస్ పట్టింపులేనితనంపై ఆగ్రహంగా ఉన్న అన్నదాతలు.. తమ సంక్షేమమే ఎజెండాగా సడలని సంకల్పంతో టీఆర్ఎస్ ఉద్యమం సాగిస్తుండడంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. గులాబీ జెండా నినదించిన ప్రతిసారీ ఢిల్లీ పీఠం దిగివచ్చిందని గుర్తుచేస్తున్నారు.
కామారెడ్డి, డిసెంబర్ 1:
మొన్న నియోజకవర్గాల్లో.. నిన్న రాష్ట్ర రాజధానిలో.. నేడు దేశ రాజధానిలో అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ పోరాటం తీవ్రతరం చేసింది. తెలంగాణ అన్నదాత తరఫున పార్లమెంటులో గులాబీదళం గళమెత్తింది. యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించే ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. బీజేపీ రెండు నాల్కల ధోరణితోపాటు కేంద్ర ప్రభుత్వం నాన్చుడు విధానాన్ని ఎండగడుతూ ఎంపీలు చేసిన ఆందోళన ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసింది. రైతు సంక్షేమమే ఎజెండాగా వ్యవహరించే టీఆర్ఎస్ పార్టీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని టీవీల్లో చూస్తున్న తెలంగాణ రైతాంగం, ప్రజానీకం సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నది. మరోవైపు మూడు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు కర్షకుల సమస్యలపై పోరాడుతున్నా ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కన్నెత్తి చూడకపోవడం, మద్దతు ప్రకటించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతుకు అండగా ఉండేది, రైతు సంక్షేమానికి కృషి చేసేది టీఆర్ఎస్ ఒక్కటేనని పార్లమెంటు సాక్షిగా తేటతెల్లమైందని తెలంగాణ ప్రజానీకం అంటున్నది.
మూడోరోజూ నిరసన హోరు
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని, యాసంగిలో పంట కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా మూడోరోజు ఆందోళన చేపట్టారు. ఉభయసభల్లో ఎంపీలు కేశవరావు, కేఆర్. సురేశ్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, సంతోష్కుమార్, బీబీపాటిల్, కొత్తప్రభాకర్రెడ్డి, పసునూరి దయాకర్, డాక్టర్ రంజిత్, మాలోతు కవిత, మన్నె శ్రీనివాసరెడ్డి, పి.రాములు నిరసనగళం వినిపించారు. స్పీకర్ పోడియం వద్ద దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. జీరో అవర్లో వెల్లోకి దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు సేవ్ ఫార్మర్.. అంటూ నినదించారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లోపల, బయట ప్లకార్డులను ప్రదర్శించారు. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
అర్వింద్పై ఆగ్రహం
మూడు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళనలు చేస్తుంటే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రైతుల తరఫున ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. లైవ్ షోలు, మీడియా ముందు మాట్లాడే ఎంపీ ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు లెక్కలు చెబుతూ, రైతాంగాన్ని గందరగోళంలో పడేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవద్దని, రైతు సమస్యలతో ఆటలాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రైతుల తరఫున మాట్లాడి యాసంగిలో వడ్లు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని, పదవికి లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే యాసంగిలో పంట సాగుపై కేంద్రం అవలంబిస్తున్న విధానలపై రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేయడంపై నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాల కర్షకులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా రైతాంగ సమస్యలపై పోరాటం చేయడంపై అభినందిస్తున్నారు. ఎప్పటికైనా రైతు పక్షాన నిలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని వెల్లడిస్తున్నారు.
యాసంగిపై స్పష్టత ఇవ్వాలి
తెలంగాణలో రైతులు సాగు చేస్తున్న పంటపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. యాసంగిలో వరి సాగుపై కేంద్రం క్లారిటీ ఇవ్వకుండా రైతులను నష్టపరిచే చర్యలు చేపట్టింది. లోక్సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన గళం వినిపించి రైతులకు మరోసారి అండగా నిలిచారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణలో ధాన్యం సేకరించాలి.
ఎంపీ అర్వింద్ వైఖరి ప్రకటించాలి
కేంద్రం యాసంగిలో వడ్లు కొనబోమని ప్రకటిస్తుంది. నిజామాబాద్ ఎంపీ తన వైఖరిని ప్రకటించి అమీతుమి తేల్చుకోవాలి. రైతుల పక్షాన నిలబడుతాడో, కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటాడో ఎంపీ చెప్పాలి. ఎన్నికల సమయంలో పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ ఇప్పటి వరకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయించలేదు. రైతులపై ఎంపీ అర్వింద్ వైఖరిని ప్రకటించాలి.
టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేస్తుండ్రు
కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రకటించి యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో నిరసన తెలుపుతుండ్రు. వ్యవసాయాన్ని రాజకీయం చేయకుండా స్పష్టంగా చెప్పాలె. రెండు, మూడు రోజుల నుంచి టీఆర్ఎస్సోళ్లు నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం జేస్తున్నరు. రైతుల పక్షాన నిలబడే పార్టీ ఏదో ఇప్పుడు మాకు తెలుస్తున్నది.
గర్వంగా ఉన్నది..
పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు రైతుల కోసం ఉద్యమిస్తున్న తీరును చూస్తే ఎంతో గర్వంగా ఉన్నది. కేంద్రం ధాన్యం కొనాలని టీఆర్ఎస్ ఎంపీలు రోజంతా నిరసన తెలుపడం టీవీల్లో చూశాం. రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో మాకు తెలుస్తుంది. ఏ ఎంపీలు రైతుల కోసం పని చేస్తున్నారో అర్థమవుతున్నది. రైతుల కోసం, రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
మోదీకి తగిన బుద్ధిచెప్తం
కేంద్రంల ఉన్న బీజేపోళ్లు వడ్లు కొనకుండ అడ్డం పడుతున్నరు. మా రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటుల పోరాడుతుండ్రు. చానా సంతోషంగా ఉన్నది. మరి అక్కడే ఉన్న బీజేపీ ఎంపీలు నోరు మూసుకొని కుసున్నరు. మా దగ్గరికి అచ్చినప్పుడు అది జేస్తం.. ఇది జేస్తం అంటరు. ఇప్పుడేం చేస్తున్నరు. ఎప్పటికైనా రైతులను అర్థం జేసుకునేది టీఆర్ఎస్సే.
బీజేపీ ఎంపీలు తప్పించుకుంటున్నరు
తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎంపీలు ఎటు పోయిండ్రు. యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టంగా చెప్పాలని ప్రశ్నిస్తుంటే బీజేపీకి చెందిన ఇక్కడి ఎంపీలు మద్దతు తెలుపకుండా తప్పించుకుంటున్నరు. రైతులను మోసం చేస్తున్న బీజేపోళ్లకు పుట్టగతులుండవు. రైతు సంక్షేమం కోసం ఆలోచించేది ఒక్క టీఆర్ఎస్ పార్టీయేని నిరూపితమైంది.
రైతుల కోసం పాటుపడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే..
ఏండ్ల నుంచి వరి పంట సాగు చేస్తున్నం. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరితో మేం తీవ్రంగా నష్ట పో తాం. కేంద్రం తీరు మార్చుకోకపోతే మూల్యం తప్పదు.
-మొత్తిపేట శ్రీనివాస్, రైతు, కోటగిరి
జాతీయ విధానం ప్రకటించాలి..
కేంద్రం ధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలి. కనీస మద్దతు ధర కోసం వెంటనే బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించాలి. రైతులతో రాజకీయం చేయకుండా కేంద్రం స్పష్టంగా చెప్పాలి. టీఆర్ఎస్ ఎంపీలు రైతుల కోసం ఆందోళన చేస్తుంటే రాష్ర్టానికి చెందిన మిగతా ఎంపీలు ఏం చేస్తున్నరు. వారికి మా రైతుల సమస్యలు పట్టవా?