హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్షి/షాదీముబాకర్ పథకానికి నిధుల కొరత లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 10,38,428 మంది లబ్దిపొందారని చెప్పారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఆజ్మీరా రేఖానాయక్, దుర్గం చిన్నయ్య, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నన్నపునేని నరేందర్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, జాఫర్ హుస్సేన్, భాస్కర్రావు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఈ పథకం వర్తింపజేయాలని, పెండ్లి రోజే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. సభ్యులు అడిగిన మౌఖిక ప్రశ్నలకు మంత్రి గుంగుల కమలాకర్ జవాబిస్తూ ప్రపంచంలో ఏ దేశంలోనూ, దేశంలో మరే రాష్ట్రంలోనూ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేయలేదని చెప్పారు. ‘పుట్టింది నీ బిడ్డే అయినా నా తెలంగాణ ఆడబిడ్డ’ అని సీఎం కేసీఆర్ మేనమామలా ఆదుకొంటున్నారని వివరించారు. పెండ్లిరోజే కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయటానికి తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పెండ్లికి కనీసం వారం 15 రోజుల ముందే పెండ్లి కార్డు ముద్రించి నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలని, తరువాత సంబంధిత మండల తాసిల్దార్, ఆర్డీవో, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండార్స్ చేయటానికి కొంత సమయం పడుతుందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, పట్టణాలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చొరవ తీసుకొని చేయాల్సిన ప్రక్రియ పూర్తిచేస్తే పెండ్లి రోజే చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. కులాంతర వివాహాలు చేసుకొన్నవారికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నట్టు వెల్లడించారు. కల్యాణలక్ష్మి/షాదీమబారక్ పథకంతో రాష్ట్రంలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయని మంత్రి గంగుల వివరించారు.