హైదరాబాద్, జనవరి 27 : కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారికి కేంద్రం రూ.1200 కోట్లు మంజూరుచేసింది. కల్వకుర్తి నుంచి నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిపై నుంచి ఆత్మకూరు నుంచి నంద్యాల వరకు నిర్మించే ఈ రహదారి పనులు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి రూ.600 కోట్లు, కృష్ణానదిపై సోమశిల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి మరో రూ.600 కోట్లు మంజూరుకావడంతో ప్రాజెక్టు డీపీఆర్ను నెల రోజుల్లోగా పూర్తిచేయనున్నుట్ట ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. మూడు లేన్ల రోడ్డుగా దీన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. డీపీఆర్ పూర్తి కాగానే రహదారి నిర్మాణానికి టెండర్లు పిలువనున్నారు.
తిరుపతికి తగ్గనున్న 42 కిలోమీటర్లు
రహదారి నిర్మాణంలో భాగంగా కల్వకుర్తి, తాడూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. సోమశిల వద్ద కృష్ణాదినపై బ్రిడ్జి నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎర్రమటం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెన మీదుగా నంద్యాల బైపాస్ వద్ద జాతీయ రహదారి-40 జంక్షన్కు కొత్త జాతీయ రహదారిని అనుసంధానిస్తారు. ఈ జాతీయరహదారి పూర్తయితే హైదరాబాద్-తిరుపతి మధ్య 42 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి కర్నూలు మీదుగానే వెళ్లాలి. రోడ్డు పూర్తయితే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, కొల్లాపూర్ మీదుగా నంద్యాలకు వెళ్లొచ్చు, అక్కడ కర్నూలు- తిరుపతి జాతీయ రహదారికి అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి నేరుగా కడప మీదుగా తిరుపతికి వెళ్తారు. ప్రస్తుతం హైదరాబాద్- నంద్యాల మధ్య దూరం 296 కిలో మీటర్లు ఉన్నది. కొత్త జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-నంద్యాల మధ్య 254 కిలోమీటర్లకు తగ్గుతుంది. రెండురాష్ర్టాల ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం అందుబాటులోకి వస్తుంది.