హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, లిఫ్ట్ల నిర్వహణను పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూపొందించిన డెసిషన్ సపోర్ట్ సిస్టమ్పై సంబంధిత అధికారులతో తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ జలసౌధలో బుధవారం సమీక్ష జరిపారు. రంగనాయక్సాగర్, అనంతసాగర్ పంప్హౌస్ల వద్ద దీని పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మొత్తం నాలుగు కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తాజా సమీక్షలో నిర్ణయించినట్టు తెలిసింది. జలసౌధ, గజ్వేల్, కరీంనగర్, ఎస్సారెస్పీ వద్ద ఈ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థకు సంబంధించిన వివరాలను త్వరలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు వెల్లడించి, ఆమోదం తీసుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. ‘ఆన్లైన్’ ప్రక్రియతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను జలసౌధ నుంచే చేపట్టే అవకాశం కలుగుతుంది. రజత్కుమార్ నిర్వహించిన ఈ సమీక్షలో ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, నాగేందర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సాగునీటి రంగానికి సంబంధించిన అన్ని పత్రాలు, చారిత్రక డాక్యుమెంట్ల డిజిటైజేషన్ ప్రక్రియపై కూడా రజత్కుమార్ ఈ సమావేశంలో సమీక్షించారు.