యాదాద్రి భువనగిరి, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి దివ్యక్షేత్రంపై పంచనారసింహ స్వామి పాదాల చెంతకు కాళేశ్వర జలాలు చేరుకొన్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా మూడోరోజైన బుధవారం గరుడాళ్వారు, విష్వక్సేనులు, ఆళ్వారులు, సుదర్శన, పాంచజన్యాలకు షోడశ కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. మహావిష్ణు స్వరూపమైన శుద్ధ జలాలను.. మహాలక్ష్మి స్వరూపంలోని వనస్పతి ఔషధులతో కూడిన ద్రవ్యవిశేషాలు, పంచామృతాన్ని షోడశ కలశాలలో ఉంచి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ వైపు హోమాలు.. మరోవైపు మూల, మూర్తి మంత్ర జపంతో యాదాద్రి క్షేత్రం ఆధ్మాత్మిక శోభను సంతరించుకొంటున్నది. మూడోరోజు హోమ క్రతువు నిర్విఘ్నంగా సాగింది. బాలాలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చనలు, ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, మూల మంత్ర, మూర్తి మంత్ర హవనములు, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించారు. ఉగ్ర నారసింహుడిని శాంతింపజేసేందుకు మూల, మూర్తి మంత్ర జపాలను ఉదయం, రాత్రి వేళల్లో రెండు పర్యాయాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో రుత్వికులు జప హోమాలు చేపట్టగా.. వేద పండితులు చతుర్వేద పఠనం జరిపారు.
వేగంగా వసతుల కల్పన..
స్వయంభువుల దర్శనం ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుండడంతో ఆలయ అధికారులు వసతుల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు సమకూరుస్తున్నారు. ఈ నెల 25న శివాలయాన్ని ప్రారంభిస్తుండగా.. 28న లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపాలను ప్రారంభిస్తారు. భక్తులు స్నానమాచరించేందుకు లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్టలకు గండి చెరువు ద్వారా గోదావరి జలాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.