వరంగల్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని మోదీ సర్కారు రైతు, దళిత వ్యతిరేకి అని మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణలోని బీజేపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా స్థాయిని మరిచి బద్మాష్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ రిజర్వేషన్లను ఎత్తివేస్తూ, ఆహారకొరత తీర్చలేని దుస్థితి తెస్తూ, దేశ అభివృద్ధిని వెనక్కి తీసుకుపోతున్నదని విమర్శించారు. ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయం లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు చెప్పే గొప్పలు అన్నీ పచ్చి అబద్ధాలన్నారు. దేశ అభివృద్ధికి కొలమానంగా జీడీపీ వృద్ధి మోదీ పాలనలో మైనస్లోకి వెళ్లిందని గుర్తుచేశారు.
గత ఏడేండ్ల బీజేపీ పాలనలో వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా దేశం తిరోమగనంలో ఉన్నదని చెప్పారు. ప్రణాళిక లేని మోదీ ప్రభుత్వ విధానాలే దీనికి కారణమని చెప్పారు. కొత్త రాష్ట్రమైనా సీఎం కేసీఆర్ సమర్థ పాలనతో తెలంగాణ సగటున 10 శాతానికిపైగా వృద్ధి సాధిస్తున్నదని వివరించారు. ఆర్బీఐ ఏడేండ్లలో రూ.10.60 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసిందని.. ఇదంతా బడా పారిశ్రామికవేత్తలదేనని ఆరోపించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతుల కోసం ఏటా రూ.లక్ష కోట్లు కేటాయించి పంటలను కొనుగోలు చేయాలని కడియం డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగు రంగం బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని కడియం గుర్తుచేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, గ్రా మాల్లోనే పంటల కొనుగోలు తదితర విధానాలతో రాష్ట్రంలో వ్యవసాయరంగం వృద్ధిలోకి వచ్చిందని చెప్పారు. పంటల కొనుగోలుతో గత ఐదేండ్లుగా ప్రభుత్వానికి రూ.11 వేల కోట్ల నష్టం వచ్చినా సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఆహా ర భద్రత, పంట కొనుగోలు బాధ్యత కేంద్రానిదే నని ఆయన స్పష్టంచేశారు. ఆహార భద్రత సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో దేశం 101వ స్థానంలో నిలిచినందుకు మోదీ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నా రు.
దేశంలో 14 శాతం మంది ప్రజలకు ఇప్పటికీ రెండు పూటల తిండి లేని దుస్థితి ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలా దేశాలు పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయని.. మోదీ ప్రభుత్వం మాత్రం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు తక్కువకు అమ్ముకునేలా చట్టాలను తెచ్చిందని మండిపడ్డా రు. రైతుల పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తితో నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నదని స్పష్టంచేశారు. రైతుల కోసం కేసీఆర్ స్వయంగా ధర్నాలో కూర్చుకుని కేంద్రాన్ని హెచ్చరించారని గుర్తుచేశారు. చేతనైతే తెలంగాణ అభివృద్ధికి సాయం చేయాలని, అభివృద్ధిని అడ్డుకోవద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు.