తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనావ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అందులో భాగంగా ఉదయం 8.30 నుంచి10.30 గంటల వరకు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆ తరువాత ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు.