చెన్నై, ఏప్రిల్ 23: ఇన్స్టంట్ నూడుల్స్లాగే ప్రజలు ఇన్స్టంట్ జస్టిస్(తక్షణ న్యాయం) కోరుకొంటున్నారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కానీ, సమగ్ర దర్యాపు, సరైన విచారణ జరగకుండా తక్షణ న్యాయం కావాలనుకొంటే నిజమైన న్యాయం అందదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో నిర్మించనున్న తొమ్మిది అంతస్తుల పరిపాలన భవనానికి జస్టిస్ రమణ శనివారం పునాది రాయి వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయమూర్తులు చట్టాలను గుడ్డిగా అనుసరించవద్దని, అన్ని సందర్భాలను ఒకే గాటన కట్టవద్దని సూచించారు.
నిర్ణయాలు తీసుకొనే ముందు సామాజిక, ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి, అధికారిక ఉత్తర్వులను, తీర్పులను స్థానిక భాషల్లోనే జారీ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ రమణ అన్నారు. సమీప భవిష్యత్తులో సాంకేతికత సాయంతో ఈ అడ్డంకులను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
భాష, సాంస్కృతిక హక్కుల పరిరక్షణలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. అంతకుముందు తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు ప్రొసీడింగులను తమిళ భాషలో జారీ చేయడానికి అనుమతించాలని జస్టిస్ రమణను కోరారు. చెన్నైలో సుప్రీం కోర్టు బెంచీని ఏర్పాటు చేయాలన్నారు.
వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిగత అభివృద్ధికి భాష ఎంతో దోహదం చేస్తుందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. తమిళనాడులో నిర్వహించిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 29వ వార్షికోత్సవాల్లో జస్టిస్ రమణ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు తమ మూలాలను మర్చిపోవద్దన్నారు. భాష ఏదైనా నేర్చుకొంటే నష్టం లేదని పేర్కొన్నారు. అలాగని మాతృ భాషను విస్మరించవద్దని అన్నారు. మాతృభాషలో పట్టు ఉంటేనే మిగతా భాషలు నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం సులువవుతుందని పేర్కొన్నారు.