ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు రాజకీయ వేడి రాజుకుంటూనే ఉంది. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పైగా ఆ పార్టీలో సినిమా వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాంతో వాళ్లు కూడా బాబును సీరియస్ గా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయనెలాంటో వాడో తెలుసా అంటూ మీడియా ముందు రెచ్చిపోయాడు పోసాని. అవసరం ఉన్నపుడు ఒకలా.. తీరిపోయిన తర్వాత మరోలా ఉండే రాజకీయ నాయకుడు చంద్రబాబు అంటూ ఆరోపించాడు.
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే చేసాడని గుర్తు చేసాడు పోసాని.
2014 ఎన్నికల సమయంలో పవన్ అంత కష్టపడి పార్టీని గెలిపించాడు కాబట్టి అప్పుడు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నాడు.. అదే పవన్ 2019 ఎన్నికల సమయంలో విడిగా వచ్చి తెలుగుదేశం నాయకులు చేసిన అవినీతి గురించి అడిగినపుడు విలన్ అయిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు పోసాని. అప్పుడు పొగిడిన నోళ్లే.. తమ తప్పులను ఎత్తి చూపించాడని పవన్ ను తిట్టారంటూ తెలుగుదేశం నాయకులపై, చంద్రబాబుపై మండిపడ్డాడు పోసాని.
వాళ్ల గెలుపులో పవన్ పాత్ర ఉన్నపుడు ఆయన్ని పక్కనే స్టేజీపై కూర్చోబెట్టారని.. ఆ సమయంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్టేజి కింద ఉన్న విషయం గుర్తు చేసాడు పోసాని. కానీ ఆ తర్వాత లోకేష్ నువ్వు ఇంకెంత సంపాదించుకుంటావయ్యా.. పైనున్న మీ తాత కూడా సంతోషంగా లేడు నిన్ను చూసి అంటూ పవన్ ఆరోపించడంతోనే వాళ్లకు ఆయన విలన్ అయిపోయాడని తెలిపాడు.
అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే చేసారని చెప్పుకొచ్చాడు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడే కాదు జనాన్ని రప్పించగల సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఎన్టీఆర్ ను 2009 ఎన్నికల్లో చంద్రబాబు తెలివిగా వాడుకున్నాడని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసేసాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు మళ్లీ పార్టీ పరిస్థితి బాగోలేకపోవడంతో మళ్లీ ఎన్టీఆర్ వైపు అడుగులు వేస్తున్నాడని చెప్పాడు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకముందు ఆయనతో ఎవరూ మాట్లాడలేదని.. ఒక్కరు కూడా పలకరించలేదని చెప్పాడు పోసాని. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆ కుర్రాడిని అనాథలా చూసారంటూ చెప్పాడు. కానీ ఈ రోజు ఇండస్ట్రీలో టాప్ హీరో అయ్యాడు కాబట్టి మళ్లీ ఆయన వెంట పడుతున్నారని గుర్తు చేసాడు. ఎన్టీఆర్ కు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కూడా తెలుగుదేశం వైపు వెళ్లడని జోష్యం చెప్పాడు.