న్యూఢిల్లీ, నవంబర్ 22: జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దాదాపు రెండేండ్ల చర్చోపచర్చల అనంతరం వ్యక్తిగత డాటా పరిరక్షణ (పీడీపీ) బిల్లుపై నివేదికను సోమవారం ఆమోదించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిని మధ్యవర్తి సంస్థలుగా కాకుండా సామాజిక మాధ్యమ వేదికలుగా పరిగణించి, వాటిని ఈ ప్రతిపాదిత చట్టం పరిధిలోకి తీసుకురావాలని కూడా సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి, పోలీస్, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, యూఐడీఏఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. దేశ భద్రత, ప్రజా సంక్షేమం విషయంలో న్యాయమైన, సహేతుకమైన పద్ధతులను పాటించనప్పుడు మాత్రమే ఈ మినహాయింపు వర్తించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి అదుపు లేని అధికారాలు కట్టబెట్టే ఈ బిల్లులోని పలు అంశాలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు దుమారం రేపుతుందని భావిస్తున్నారు.
పౌరుల వ్యక్తిగత డాటాకు రక్షణ కల్పించేందుకు, దాని కోసం డాటా ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు 2019లో ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపింది. ఈ బిల్లు ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. దీనిపై ప్రతిపక్షాలు విభేదిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలకు కేంద్రం మినహాయింపునివ్వాలంటే పార్లమెంటు అనుమతి కోరాలంటున్నాయి.
-కేంద్ర ప్రభుత్వానికి, చట్టాలను అమలుచేసే కేంద్ర సంస్థలకు విశేషాధికారాలు కల్పించే వివాదాస్పద 35వ సెక్షన్ను జేపీసీ సమర్థించింది.
-ఈ సెక్షన్ ప్రకారం దేశ సార్వభౌమత్వం, భద్రత కోసం వ్యక్తుల అనుమతి లేకుండా వారి డాటాను దర్యాప్తు సంస్థలు ప్రాసెస్ చేయవచ్చు.
-యూఐడీఏఐతో పాటు ఆదాయ పన్ను శాఖకు కూడా ఈ ప్రతిపాదిత చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని జేపీసీ సిఫారసు చేసింది.
-జరిమానాలకు సంబంధించి… చిన్న అపరాధానికి రూ.5 కోట్లు, పెద్దదైతే రూ.10 కోట్లకు మించకూడదని సిఫారసు చేసింది.
-జేపీసీ సభ్యులు ఈ బిల్లుకు 200కు పైగా సవరణలు, 93 సిఫారసులు చేశారు.
-ఇది డాటా పరిరక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతుందని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి అభిప్రాయపడ్డారు.
-ఈ బిల్లును ఆమోదించిన తర్వాత చట్టం అమలుకు రెండేండ్లు గడువు ఇవ్వాలని చౌదరి సూచించారు.
జైరాం రమేశ్తో పాటు ఏడుగురు కాంగ్రెస్, తృణమూల్, బీజేడీ ఎంపీలు జేపీసీ నివేదికపై అసమ్మతి నోట్ (డిసెంట్ నోట్) ఇచ్చారు. కేంద్రానికి అడ్డూఅదుపు లేని అధికారాలను కల్పించే ఈ బిల్లులోని సెక్షన్ 35పై వారు అభ్యంతరం తెలిపారు.