కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 16 : రేవంత్రెడ్డి అహంకారం వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. సోమవారం కూకట్పల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బాలానగర్ రాజీవ్గాంధీనగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నితీశ్రెడ్డితో పాటు 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో హైదరాబాద్ నగరం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని.. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కూకట్పల్లిలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి ఆదర్శవంతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, విజ్ఞత కలిగిన ప్రజలు బీఆర్ఎస్నే ఆదరిస్తారన్నారు.
చేసిన అభివృద్ధి కండ్లముందే కనబడుతుందని, ఎమ్మెల్యేగా చేసిన పనులను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీలో చేరిన నాయకులంతా కష్టపడి పనిచేయాలని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. మరలా సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు.