కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఎన్నికలు వచ్చాయంటే చాలు మాటలు, ముచ్చట్లు చెప్పడానికి ఎంతో మంది వస్తారు. బెల్లం, పుట్నాలు చూపెడతారు. ఎవరెవరో వచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(MLA Koneru Konappa )అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కోనప్ప బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయమాటలు నమ్మొద్ధన్నారు. ఎన్నికల తర్వాత ఆసరా పెన్షన్ 5 వేలకు పెంపు, రూ. 400 లకే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా, రేషన్ సన్న బియ్యం, రైతుబంధు రూ.16 వేలకు పెంపు ఇలాంటివి ఎన్నో పథకాలు సీఎం కేసీఆర్ సామాన్యుడి కోసం తీసుకొస్తారన్నారు.
అన్ని పార్టీల వాళ్లు సిర్పూర్లో తిరుగుతున్నారు. అది చేస్తాం. ఇది చేస్తాం అని అంటున్నారు. మీ ఊరిలో, మీ వాడలో ఎవరు రోడ్లు వేశారో మీకు తెలుసు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే గరిబోల్లకు లాభం చేకూరుతుం దన్నారు. రానున్న రోజుల్లో ఎస్సీ, బీసీలకు కూడా పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.