అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గొ రోజు జోగుళాంబ అమ్మ వారు కూష్మాండ దేవీగా దర్శనమి చ్చింది. అర్చకులు ఆలయ ఈవో చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్, ధర్మకర్తలు, ఈవో వీరేశం సమక్ష్యంలో నిత్య పూజల్లో భాగంగా యాగశాలలో హోమాలు, బలిహరణలు, కుంకుమార్చనలు, మొదలగు పూజా కార్యక్రమాలు సందర్భానుసారంగా నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించారు.
అనంతరం ఆలయంలో విరామం తర్వాత సాయంత్రం వరకు సహస్రనామార్చనలు నిర్వహిస్తూ భక్తులకు సర్వదర్శన సదుపాయం కల్పించారు. సంధ్యా వేళ 6గంటల తర్వాత అమ్మ వారికి మహా మంగళహారతిలో భాగంగా దశవిద హారతులు ఇచ్చారు. రాత్రి 7గంటల సమయంలో జోగుళాంబ దేవీ కూష్మాండదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు.
కూష్మాండ దేవీగా జోగుళాంబ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూష్మాండ దేవీ అలంకరణలో ఉన్న అమ్మ వారికి కొలువు పూజ కుమారి సువాసినీ పూజ, దర్భార్ సేవ, నిర్వహించి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు. ఈ ఉత్సవాలను తిలకించిన భక్తులు నయనానందం పొందారు. ఈ మాతను పూజిచండం వల్ల చదువు, జ్ణానం ధైర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
శతకోటి ప్రభల సూర్య మండలంలో నివసించే మాత కన్నుల కాంతులు సూర్య తేజస్సుతో సమానంగా ఉంటాయి. అష్ట భుజములు కల్గి, చేతుల్లో అభయ ముద్రలను దరించి భక్తులను ఎల్లపుడు రక్షీస్తూ ఉంటుంది. సింహాన్నివాహనంగా చేసుకుని జ్ణాన స్వరూపంతో సాంసారిక మోహాలను భక్షించే కుష్మాండ దేవీ తనను నమ్మిన భక్తులకు బహు రూపాల్లో దర్శనమిస్తుంది.
పోటెత్తిన భక్తులు
ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయాలను దర్శించుకున్నారు. నదీ తీరంలో పవిత్ర స్నానాలు చేసి అమ్మ వారి, స్వామి వారి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను చూడముచ్చటగా అలంకరించారు. జాతర వాతావరణం కనిపించింది.
అమ్మ దర్శనంలో ప్రముఖులు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాల్గొ రోజు ఆదివారం సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఏపీ హైకోర్టు రిటైర్డు జడ్జి సోమయాజులు, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, గద్వాల డీఎస్పీ రంగస్వామి తదితరులు దర్శించుకున్నారు.