శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్ ప్రాంతంలోని పెత్సీర్లో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారు జామున బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇరువైపులా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొన్నారు.
ఉగ్రవాదులు తప్పించుకోకుండా గ్రామం నలువైపులా దిగ్బంధించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో నక్కిన వారిని పట్టుకునేందు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కశ్మీర్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ అబ్బాస్ షేక్, రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన సాఖిబ్ మంజూర్ హతమైన విషయం తెలిసిందే. అవంతిపోరాలోని నాగబెరన్ ట్రాల్ అటవీ ప్రాంతంలో జైషే మహ్మద్కు అనుబంధంగా పని చేస్తున్న ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను సైతం శనివారం సైన్యం మట్టుబెట్టింది.