న్యూఢిల్లీ, మార్చి 28: రిలయన్స్ జియో కొత్తగా నెలరోజుల కాలపరిమితితో ఒక కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ప్రతీ నెలా రీచార్జ్ చేయాల్సిన తేదీని ప్రీపెయిడ్ యూజర్లు సులభంగా గుర్తుంచుకునేలా క్యాలండర్ నెల వ్యాలిడిటీతో రూ.259 రీచార్జ్ ప్లాన్ను ప్రవేశపెడుతున్నట్టు జియో తెలిపింది. ఈ తరహా ప్లాన్ను తొలుత ఆరంభిస్తున్నది జియోనే. నెలకు 30, 31 రోజులున్నా వాటితో సంబంధం లేకుండా కచ్చితంగా క్యాలండర్ నెల మొత్తం రోజుకు 1.5 జీబీ డాటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఇతర ప్రయోజనాలు ఈ ప్లాన్తో లభిస్తాయి. ఉదాహరణకు ఏప్రిల్ 5న రీచార్జ్ చేసుకుంటే తదుపరి నెలల్లో అదే తేదీన రీచార్జ్ (మే 5, జూన్ 5, జూలై 5) చేస్తే సరిపోతుంది. అలాగే ఇతర ప్రీపెయిడ్ ప్లాన్స్లానే ఈ రూ.259 ప్లాన్ను ఒకేసారి ఎన్నైనా రీచార్జ్ చేసుకోవచ్చు. అలా అడ్వాన్స్గా రీచార్జ్ చేసిన ప్లాన్ క్యూలో ఉంటుంది. ప్రస్తుత యూజర్లు, కొత్త యూజర్లు ఇరువురికీ ఈ ప్లాన్ ఆన్లైన్, ఆఫ్లైన్లలో లభిస్తుంది. టెలికం సంస్థలకు ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్లాన్ వచ్చింది. ఇప్పటివరకూ సంస్థలు 28 రోజుల వ్యాలిడిటీగల ప్లాన్స్ను మాత్రమే విక్రయిస్తున్నాయి.