దుబాయ్: దిగ్గజ క్రీడాకారులకు ఐసీసీ ఇచ్చే విశేష గుర్తింపు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ షాన్ పొలాక్, ఇంగ్లండ్ మహిళా ప్లేయర్ జనెట్ బ్రిటిన్ (మరణానంతరం) స్థానం దక్కించుకున్నారు. ఈ ముగ్గురితో కలిపి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన ఆటగాళ సంఖ్య 106కు చేరింది. 149 టెస్టులు, 448 వన్డేలు, 55 టీ20 మ్యాచ్లు ఆడిన జయవర్దనే శ్రీలంక క్రికెట్ చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు. 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలవడంలో ఈ దిగ్గజ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ పొలాక్ టెస్టుల్లో 421, వన్డేల్లో 393, టీ20 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ జనెట్ బ్రిటిన్ 1979-1998 మధ్య 27 టెస్టులు, 63 వన్డేలు ఆడారు. 2017లో మృతిచెందిన జనెట్కు తాజాగా ఐసీసీ విశేష గుర్తింపు లభించడం గమనార్హం.