కలెక్టర్ కృష్ణ ఆదిత్య
భూపాలపల్లి రూరల్, మార్చి 31: రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. రైతులకు ఉద్యానవన పంటలపై ఉద్యానవన అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీస్ పద్ధతిలో ఫైల్ మేనేజ్మెంట్ చేయాలని అన్నారు. ఆయా శాఖల్లో సిబ్బంది ఆన్లైన్ హాజరుపై అధికారులు సమీక్షించాలని, జెన్కో కన్వేయర్ బెల్ట్ భూ నిర్వాసితులకు భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పురుషోత్తం, డీఏవో విజయ్భాస్కర్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేశ్బాబు, హార్టికల్చర్ అధికారి అక్బర్, డీఈవో మహ్మద్ అబ్దుల్ హై, డీడబ్ల్యూవో శ్రీదేవి, డీపీఆర్వో రవికుమార్, జెన్కో, ఏఎంఆర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు
రైతులను సంఘటితం చేసి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లాలో రెండు రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మేరకు జిల్లాలో సంబంధిత శాఖల అధికారులతో కమిటీ వేసి మహదేవ్పూర్లో ఒక సంఘం, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలను కలిపి మరో రైతు ఉత్పత్తి దారుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో సంఘంలో 300 మంది రైతులు ఉంటారని తెలిపారు. ఒక జిల్లా ఒక పంట నినాదంతో రెండు సంఘాల ద్వారా మిర్చి పంట పండించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నాబార్డు వారు రైతులకు ఆర్థిక సాయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎల్డీఎం శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, జిల్లా వ్యసాయ అధికారి విజయభాస్కర్, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.