హుజూరాబాద్లో ఉప ఎన్నిక వేడి సెగలు పుటిస్తోంది. పార్టీలన్నీ గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సహా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, మంగళవారం జమ్మికుంటలో చోటుచేసుకున్న సంఘటన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
అసలేం జరిగిందంటే.. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట బ్రిడ్జి వద్ద బీజేపీ ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన వాహనాలు పెద్దమొత్తంలో ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ప్రాంగణం అంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. వచ్చే వాహనాలు, పోయే వాహనాలకు దారి లేకపోవటంతో వాహనాలన్నీ నడిరోడ్డుమీదే నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ట్రాఫిక్లో చిక్కుకున్నవాళ్లంతా బీజేపీ ప్రచార తీరుపై మండిపడ్డారు. ప్రచారం చేసుకుంటే ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండాలా? అని పెదవి విరిచారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ఓట్లు అడిగితే ఎవరు వేస్తారు? అని తమలో తామే మాట్లాడుకోవటం కనిపించింది.