న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్రోవర్ (జేఎల్ఆర్) భారత్ విపణిలో తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. జాగ్వార్ ఐ-పేస్ పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ఎస్యూవీ మోడల్ కావడంతోపాటు పూర్తిస్థాయి విద్యుత్ వినియోగ కారుగా నిలుస్తుంది.
జాగ్వార్ ఐ-పేస్ ధర రూ.1.06 కోట్ల నుంచి రూ.1.12 కోట్ల మధ్య ఉంటుంది. మెర్సిడెస్ ఈక్యూసీ, త్వరలో రానున్న ఆడీ ఈట్రాన్, పోర్చే తాయ్కాన్ మోడల్ కార్లకు జాగ్వార్ ఐ-పేస్ పోటీ పడనున్నది. ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ అనే మూడు వేరియంట్లలో వినియోగదారులకు ఐ-పేస్ లభిస్తుంది.
ఇందులో 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చింది జాగ్వార్ లాండ్ రోవర్. ఈ కారు 294కిలోవాట్ల ఇంధనం, 696 ఎన్ఎం టార్చ్ను విడుదల చేస్తుంది. కేవలం 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఐ-ఫేస్ సొంతం.
ప్రయాణంలో ప్రతి దశలో వాహనదారుడికి అద్భుతమైన అనుభూతిని అందించేలా, సులువుగా ఆపరేట్ చేయగలిగేలా ఎలక్ట్రిక్ ఐ-పేస్ను రూపొందించామని జాగ్వార్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ఉన్న 22 జేఎల్ఆర్ రిటైల్ ఔట్లెట్లలో 35 ఈవీ ఛార్జర్లను అమర్చామని పేర్కొన్నది.
ప్రతి రిటైల్ ఔట్లెట్లోనూ 7.4 కేడబ్ల్యూ ఏసీతో పాటు 25 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్లను అందుబాటులో ఉంచామని జేఎల్ఆర్ వెల్లడించింది. అలాగే రిటైల్ సిబ్బందికి ఛార్జింగ్ విధానంపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చామని తెలిపింది. తద్వారా కార్ల యూజర్లకు తలెత్తే ప్రతి సమస్య పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పింది.
కార్ల యజమానులు ఈ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారును తమ ఇండ్లల్లోనూ ఛార్జ్ చేయొచ్చని జేఎల్ఆర్ తెలిపింది. దీని కోసం స్టాండర్డ్ ఛార్జింగ్ కేబుల్ వాహనంతోపాటే వస్తుందని వెల్లడించింది. అలా కానీ పక్షంలో కంపెనీ ఇచ్చే 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్ మౌంటెడ్ ఛార్జర్ని కూడా వాడుకోవచ్చునని, ఇదీ కారుతో పాటే వస్తుందని తెలిపింది.
ఇండ్ల వద్ద ఛార్జర్ని అమర్చడానికి టాటా పవర్ లిమిటెడ్ సిబ్బంది సహకరిస్తారని జేఎల్ఆర్ చెప్పింది. ఈ కారు కొనుగోలు చేస్తే ఐదేండ్ల పాటు సర్వీస్ ప్యాకేజీ, ఐదేండ్లు రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ, ఎనిమిదేండ్లు/ 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు బెనిఫిట్లు లభిస్తాయని తెలిపింది.
ఐ-ఫేస్ మోడల్ కారులో ‘సాఫ్ట్వేర్ ఓవర్ ది ఎయిర్ (ఎస్ఓటీఏ)’ వ్యవస్థను పొందుపరిచామని జాగ్వార్ పేర్కొంది. దీంతో బ్యాటరీ మేనేజ్మెంట్, ఛార్జింగ్, ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలను రిమోట్తోనే నియంత్రించవచ్చునని తెలిపింది.
పది అంగుళాలు లేదా ఐదంగుళాల టచ్ స్క్రీన్తో కూడిన పీవీ ప్రో ఇన్ఫోటైన్మెంట్ టెక్నాలజీ, హెచ్డీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్ అప్ డిస్ప్లే, ఆంబియెంట్ లైటింగ్, మెరిడియన్ ప్రీమియం ఆడియో సిస్టమ్, ఇన్ కంట్రోల్ కనెక్టెడ్ టెక్నాలజీ, లేటెస్ట్ జనరేషన్ నేవిగేషన్, జాగ్వార్ రిమోట్ యాప్ తదితర ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!