జగిత్యాల రూరల్, మార్చి 30: ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సీజనల్ నాయకుడు మధుయాష్కీ.. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఏం అభివృద్ధి చేశాడో అందరికీ తెలుసని విమర్శించారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డు కోసం ఎక్కని మెట్టు లేదని పేర్కొన్నారు.
పసుపు బోర్డు కోసం కవిత పసుపు పండించే రాష్ర్టాల ముఖ్యమంత్రులను, ప్రధాని నరేంద్రమోడీని సైతం కలిశారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని మధుయాష్కీ తెలుసుకోవాలని హితవుపలికారు. నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీ కోసం మధుయాష్కీ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. వీలైతే రైతుల పక్షాన నిలవాలని, రాహుల్గాంధీ రైతుల పక్షాన పోరాడేలా మధుయాష్కీ కృషిచేయాలని సూచించారు.