హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ): ‘కేంద్ర మంత్రి బండి సంజయ్కు బుద్ధి లేదు.. ఆయన నోటికి హద్దులేదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. నీట్ అవకతకలకు బాధ్యులను శిక్షించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకు దిగిన విద్యార్థులను బండి సంజయ్ దేశద్రోహులుగా చిత్రీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘140 కోట్ల దేశ జనాభాలో సగం మంది టెర్రరిస్టులేనా? మీరు చెప్పిందే నిజమైతే 12 ఏండ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? యువత నిరాశ నిస్పృహాలకు బీజేపీ కారణం కాదా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఆయన, ఆయన కుటుంబసభ్యుల తీరుతో రాష్ట్రంలో బీజేపీ పని ఖతమైందని తెలిపారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ తెలంగాణభవన్లో రెండు డాక్యుమెంటరీలు, పాట సీడీని ఇతర నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత ఆకాంక్షలను గుర్తించి వారి కోర్కెలను నెరవేర్చాలని, లేదంటే పాలక పార్టీలకు పుట్టగతుల్లేకుండా పోతాయని హెచ్చరించారు.
బడేభాయ్ మోదీకి భయపడే సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లకుండా కొడంగల్లో ధర్నా పేరిట డ్రామాలాడారని ధ్వజమెత్తారు. 30 నెలల్లో 80 సార్లు ఢిల్లీకి వెళ్లి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రికి గాయపడ్డ రాహుల్ను పరామర్శించే తీరిక దొరకలేదా? అని ప్రశ్నించారు. దేశంలో అన్ని వ్యవస్థలతోపాటు న్యాయవ్యవస్థ కుప్పకూలడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. దేశ యువతను ఓ జడ్జి కాక్రోచ్లతో పోల్చారని, ఆ బొద్దింకలే నేడు కేంద్రంలోని నియంతృత్వ సర్కార్పై పోరాట పటిమను చూపాయని చెప్పారు. దేశ నిర్మాణానికి యువత సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. జంతర్మంతర్లో ఆందోళనకు దిగిన విద్యార్థుల వద్దకు వెళ్లి కేంద్రాన్ని ఎండగట్టాల్సిన రాహుల్గాంధీ.. మోదీ ఇంటి ఎదుట నిరసన తెలుపడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
ఢిల్లీలో విద్యార్థులపై సర్కార్ సాగించిన దమనకాండకు నిరసనగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారని జగదీశ్రెడ్డి వివరించారు. ఉద్యమకారుడిగా, పాలనాదక్షుడిగా, మానవతావాదిగా ప్రత్యేక గుర్తింపు పొందిన కేటీఆర్.. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
‘తెలంగాణకు నిజమైన కాపలాదారు కేసీఆరే. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’ అని జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలోని రాజకీయాలను జెన్జీ నిశితంగా గమనిస్తున్నదని, కేసీఆర్ సైతం ప్రతిక్షణం యువత, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గమనిస్తున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడూ పార్టీ నేతలకు సూచనలిస్తూ ముందుకు నడుపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడంలో రెండు ఢిల్లీ పార్టీలది అందెవేసిన చెయ్యి అని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ ఆఫీసును బీజేపీ.. బీజేపీ ఆఫీసును కాంగ్రెస్ ముట్టడిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడు ఇతర పార్టీల కార్యాలయాల వద్ద ఆందోళన చేయలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు రావుల చంద్రశేఖర్రెడ్డి, గాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ నేతలు చిరుమల్ల రాకేశ్, కిశోర్గౌడ్ పాల్గొన్నారు.