జడ్చర్ల: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, అందుకోసమే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్. సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలోని చంద్రగార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్కు చెందిన గుడ్ల అంజిబాబుతో పాటు అతని ఆధ్వర్యంలో దాదాపు 200వందల మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు పట్టణంలో బారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని మోటార్ సైకిల్ నడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసని, వారి హాయాంలో రైతులకు 24గంటల విద్యుత్ ఇవ్వకపోవడానికి వారి చేతగాని తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే 24గంటల నిరంతర విద్యుత్ అందిచడం జరిగిందన్నారు.
గతంలో ఏ గ్రామానికి వెళ్లినా తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడేవారని, బిందెలు పట్టుకుని రోడ్లపై ధర్నాలు చేసేవారని, కాని తమ ప్రభత్వుం మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించడం జరుగుతుందని ఇప్పుడు ప్రజలకు ఇంటిముందరే నల్లాల ద్వారా నీటిని అందించడం జరుగుతుందన్నారు. జడ్చర్ల పట్టణంలో గతంలో 10 రోజులకు ఒకమారు నీటిని వదిలే పరిస్తితి ఉండేదని కానీ నేడు ఆది పోయిందన్నారు. మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లాలు ఇవ్వ డమే కాకుండా ప్రతిరోజూ నీటిని ఇవ్వడం జరుగుతుందన్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను నిర్మిచడం జరిగిందని, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ లు పూర్తయితే రెండేండ్లలో జడ్చర్ల నియోజకవర్గంలో లక్షా 60వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గుడ్ల సరళ, గుడ్ల రాము, ఎ.బాలస్వామి, ఎం.శేఖర్, పండ్ల శ్రీను, బూర్గు ఆనంద్, సందుల శాంత య్య, రఘువీర్, రాజు, రాఘవేందర్, రవి, కృష్ణ, మల్లే, రామకృష్ణ, బాలు, కార్తిక్, జి.గోపాల్, అశోక్, ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక, సర్పంచ్ ప్రణిల్చందర్, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు రఘుపతిరెడ్డి, టౌన్ అద్యక్షుడు నర్సిములు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ జంగయ్య, ఇమ్మూ, నాగిరెడ్డి, శ్రీనుయాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొగన్నారు.