హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ) : బీజేపీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నదని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు. చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఉక్కుపాదం మోపుతున్నదని మండిపడ్డారు. ‘రాజ్యాంగ రక్షణ’ పేరిట ఢిల్లీ జంతర్మంతర్ వద్ద తెలంగాణ రైతు, అంబేద్కర్ యువజన, దళిత, గిరిజన ఆదివాసీ, కార్మిక కర్షక సంఘాల జేఏసీ శనివారం మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు తొక్కి వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు హక్కులను హరిస్తూ, మరోవైపు నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని అన్నారు. తెలంగాణ రైతాంగం పండిస్తున్న ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేసి బీజేపీ సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ధర్నాలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.