లక్నో, ఫిబ్రవరి 7: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీపై ప్రజల్లో గూడుకట్టుకొన్న వ్యతిరేకత ప్రచార సమయంలో బయటపడుతుండటంతో కాషాయ పార్టీలో గుబులు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని అడ్డదారులు తొక్కుతున్నది. ఇందుకు అధికారులను పావులుగా వాడుకుంటున్నది. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం నుంచి మొదలైంది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఈ సౌకర్యం కల్పించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో అధికార బీజేపీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓటేసేందుకు వచ్చిన దివ్యాంగులను, సీనియర్ సిటిజన్లను బలవంతంగా బీజేపీకి ఓటేసేలా ఒత్తిడి తెస్తున్నారు.
ఒక్క ఓటేగా..
సురేందర్ సింగ్ అనే ఓ దివ్యాంగుడు ఆదివారం ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలింగ్ కేంద్రానికి ఓటేయడానికి వచ్చాడు. అక్కడే ఉన్న కొందరు బీజేపీకి ఓటేయాలని అతన్ని బలవంతపెట్టారు. సైకిల్ గుర్తుకు (సమాజ్వాదీ పార్టీ-ఎస్పీ) ఓటేయడానికి వచ్చానని అతను ఎంతచెప్పినా పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓ అధికారి తన బ్యాలెట్ పేపర్లను లాక్కొని, బీజేపీకి ఓటేశాడని సురేందర్ ఆరోపించారు. ఈ విషయం బయటకు తెలియడంతో అధికార బీజేపీ ఆగడాలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేపట్టారు. అక్కడికి వచ్చిన సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ బీజేపీకి వంత పాడుతూ.. ‘ఒక్క ఓటేగా.. దాంతో ఏమన్నా మార్పు వస్తుందా?’ అని ప్రశ్నించారు. ఈ వీడియోను ఎస్పీ చీఫ్ అఖిలేశ్ ట్వీట్ చేశారు. వీడియోలో ఉన్న అధికారి, రిగ్గింగ్ చేసిన అధికారితో పాటు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సస్పెండ్ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.
జూనియర్ల ఓటర్ ఐడీలతో..
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కొందరు ఉన్నతాధికారులు తమ జూనియర్ల ఓటర్ ఐడీలను తీసుకొని దొంగ ఓటింగ్కు (ఫేక్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు) పాల్పడుతున్నారని అఖిలేశ్ ఆరోపించారు. లలిత్పూర్, సహరాన్పూర్ తదితర ప్రాంతాల్లో ఇది యథేచ్ఛగా సాగుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగానే ఓటేసే అవకాశం కల్పిస్తారు.