వరంగల్ : ఒల్లు గుల్ల చేసుకొని ఆరుగాలం శ్రమించిన రైతన్నకు ప్రకృతి ప్రకోపంతో విషాదమే మిగిలింది. చేతికందొచ్చిన కొచ్చిన మిర్చి పంట నేలరాలింది. అకాల వర్షాలు రైతన్నలను దెబ్బతీశాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి దయాకర్ రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం జిల్లాలోని నర్సంపేట, భూపాలపల్లి, మంథనిలో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ..అకాలవర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవం. రైతన్నలు ఎవరు కూడా అధైర్య పడొద్దన్నారు. దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగా రైతులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు.
వ్యవసాయ విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయన్నారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్ సర్కారే మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలవుతున్నాయి. ఎనిమిదో విడతతో రూ.50 వేల కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు చేరాయన్నారు.
నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..బాధితులందరికి న్యాయం చేస్తామన్నారు. మిర్చి రైతుల పరిస్థితి బాధాకరం. చేతికొచ్చిన పంట నేలపాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధైర్యంగా ఉండాలన్నారు.
పరకాల, నర్సంపేట, భూపాలపల్లి పరిధిలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంపీలు పలునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి , కలెక్టర్ పాల్గొన్నారు.