గత కొంతకాలంగా పూజాహెగ్డేకు అదృష్టం కలిసి రావట్లేదు. ఇటు తెలుగులో అటు బాలీవుడ్లో సైతం ఈ భామ చేసిన సినిమాలు ఆశించిన విజయాల్ని సాధించలేకపోయాయి. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు కాస్త విరామాన్ని ప్రకటించింది. కొంత టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ మంచి కథాంశాలను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉందట ఈ మంగళూరు సోయగం.
తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో పూజాహెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించనున్నట్లు తెలిసింది. ద్వితీయార్ధంలో వచ్చే ఈ ఐటెంసాంగ్ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు కొరటాల శివ. మాస్ మెచ్చేలా సంగీత దర్శకుడు అనిరుథ్ ఈ పాట కోసం మాస్ బీట్తో మంచి ట్యూన్ను సిద్ధం చేశారని అంటున్నారు. ఐటెంసాంగ్ కోసం పలువురు నాయికల పేర్లను పరిశీలించిన దర్శకుడు కొరటాల శివ, చివరకు పూజాహెగ్డేను ఖరారు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ‘దేవర’ చిత్రీకరణ దశలో ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో
విడుదలకానుంది.