సొంతగడ్డపై బెబ్బులిలా చెలరేగిన భారత్ లంకేయుల భరతం పట్టింది. వెస్టిండీస్పై వీర విజృంభణతో వన్డే, టీ20 సిరీస్లను క్లీన్స్వీప్ చేసిన రోహిత్ సేన.. అదే జోష్లో లంకను ఊచకోత కోసింది. ఇషాన్, శ్రేయస్,రోహిత్ ధనాధన్ షాట్లతో పరుగుల వరద పారిస్తే.. బౌలర్లు సమిష్టి కృషితో లంకకు కళ్లెం వేశారు. ఈ క్రమంలో వరుసగా పదో టీ20లో విజయం సాధించిన టీమ్ఇండియా.. మరో మైలురాయి సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది!
లక్నో: సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన అనంతరం స్వదేశంలో వెస్టిండీస్ను చిత్తు కింద కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకపై కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన 62 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (44; 2 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. లంక బౌలర్లలో దసున్ షనక, లహిరు కుమార చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. భారీ ఛేజింగ్లో భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. చరిత అసలెంక (53 నాటౌ ట్) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విధ్వంసక ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డ ఇషాన్ కిషన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం ధర్మశాలలో జరుగనుంది.
గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ‘తగ్గేదేలే’ సెలెబ్రేషన్స్తో సందడి చేశాడు. దినేశ్ చండీమాల్ వికెట్ పడగొట్టిన అనంతరం ైస్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ను అనుకరిస్తూ సంబురాలు చేసుకోవడంతో మైదానంలో నవ్వులు పూశాయి.
భారత్: 20 ఓవర్లలో 199/2 (ఇషాన్ 89, శ్రేయస్ 57 నాటౌట్; షనక 1/19), శ్రీలంక: 20 ఓవర్లలో 137/6 (అసలంక 53; భువనేశ్వర్ 2/9).