న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సోనియా గాంధీ ఫోటోలు ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు. స్పీకర్ ఓం బిర్లా చైర్ వద్ద సోనియా ఫోటోలతో నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ తో లింకు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో సోనియాను ఇవాళ ఈడీ విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఈడీ తీరును ఖండిస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ సమయంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏమైనా మానవాతీతురాలా అని నిలదీశారు. చట్టం కంటే తామే అధికులమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. గందరగోళం మధ్య సభను కాసేపు వాయిదావేశారు.
కాంగ్రెస్ వాకౌట్
కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్లో కేంద్ర వైఖరికి నిరసనగా ప్రదర్శన చేపట్టారు. సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు బైఠాయించారు. దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియాకు మద్దతుగా ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేసి తమ పార్టీ ప్రధాన కార్యాలయం వరకు వెళ్లారు.