మహబూబాబాద్ : సాగునీటి కోసం రైతులు ఆందోళన పడకుండా ఇరిగేషన్ ప్రణాళిక చేయాలి. ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
జిల్లాలో నేడు కలెక్టర్ కార్యాలయంలో వివిధ అంశాలపై సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సాగునీటి విషయంలో పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అన్ని ప్రాంతాలకు సాగునీరు సరిపోయే విధంగా అందేలా చూడాలన్నారు.
మున్నేరు వాగులోకి ఎస్సారెస్సీ నీరు తీసుకురావాలని, తాళ్లపూసపల్లి నుంచి ఈదుల పూసపల్లికి నీళ్లు తేవాన్నారు. గార్ల, బయ్యారం, రైల్వే క్రాసింగ్ అవతల ఉన్న భూములన్నింటికీ సాగు నీరు అందించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ మనకు ఇప్పుడు ప్రత్యేకంగా చీఫ్ ఇంజినీర్ను కూడా ఇచ్చినందున రైతులు భవిష్యత్లో నీటి కోసం ఎలాంటి ఆందోళన చెందని విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.
జిల్లాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు అయిందని, దీనికి మరిన్ని నిధులు కావాలని కోరామన్నారు. త్వరలో అవి వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పట్టణ అవసరాలు తీర్చే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఉంటుందన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఎస్సీ కోటిరెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.