న్యూఢిల్లీ: దేశంలోని ఇన్సూరెన్స్ సంస్థలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నూతన నిబంధనలు జారీచేసింది. పాలసీదారులతో సంబంధాల కొనసాగించాలని, ప్రామాణిక పద్ధతిలో సమాచారం అందించడానికి పాలసీదారులకు నిర్థిష్ట వ్యవధిలో నోటీసులు పంపించాలని తాజా నిబంధనల్లో సూచించింది. పాలసీదారులకు బీమా సంస్థలు.. ఆరోగ్య బీమా కవరేజీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని పేర్కొన్నది. బీమాసంస్థలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చర్యలు ప్రారంభించాలని మార్చి 1న జారీ చేసిన సర్క్యులర్లో ఐఆర్డీఏఐ సూచించింది. నూతన నిబంధనలను పూర్తిస్థాయిలో అమల్లోకి తేవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు 2021 జూన్ 1 వరకు గడువు ఇచ్చింది. అన్ని ఆరోగ్యబీమా పాలసీలకు తమ తాజా నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఐఆర్డీఏఐ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. పాలసీ సర్వీసింగ్లో భాగంగా, బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీ గురించి ప్రాథమిక సమాచారాన్ని పాలసీదారులకు తెలియజేయాలి. వాటిలో పాలసీ సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం బీమా, కవరేజీ పరిధి, పాలసీ పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య, పాలసీ వ్యవధి, సెటిల్ చేసిన క్లెయిమ్ల మొత్తం, మిగతా బీమా హామీ, బోనస్ ఏదైనా ఉంటే దాని వివరాలు పాలసీదారునికి అందించాలి. సమాచారం పునరుద్ధరణ, ప్రీమియం చెల్లింపు వ్యవధి, పునరుద్ధరణకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం, గ్రేస్ పీరియడ్, సంప్రదింపు వివరాలు, బీమా సంస్థ, పాలసీదారు సంబంధిత సేవ, టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ వంటివి చేర్చాలి. పాలసీదారులకు సంవత్సరానికి రెండుసార్లు సమాచారం ఇవ్వాలి. అంటే పాలసీ జారీచేసిన ఆరు నెలల తరువాత, పునరుద్ధరణ గడువు తేదీకి కనీసం ఒక నెల ముందు ఈ వివరాలు తెలియజేయాలి. అయితే మల్టీ ఇయర్ పాలసీ విషయంలో, పాలసీ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కింద ఏదైనా క్లెయిమ్ పరిష్కారం అయిన సందర్భంలో, బీమా మొత్తానికి సంబంధించిన వివరాలతో పాటు అందుబాటులో ఉన్న సంచిత బోనస్ ఏదైనా ఉంటే పాలసీదారునికి తెలియజేయాలి. క్లెయిమ్ను పరిష్కరించిన 15 రోజుల్లోపు పాలసీదారులకు సమాచారం ఇవ్వాలి. ఐఆర్డీఏఐ సర్క్యులర్ ప్రకారం బీమా సంస్థ పాలసీదారునికి సమాచారం తెలియజేయడానికి ఏదైనా కమ్యూనికేషన్ పద్ధతిని ఎంచుకోవచ్చు.