Sea Mines : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ హెచ్చరికలు పట్టించుకోని నౌకలపై ఇప్పటికే అమెరికా-ఇరాన్ (USA-Iran) పోటీపడి దాడులు చేస్తున్నాయి. మరోవైపు యుద్ధం ప్రారంభంలో ఇరాన్ (Iran) అమర్చిన మందుపాతరలు (Sea Mines) మరో ముప్పుగా పరిణమించాయి.
ఈ తెల్లవారుజమున రెండు చమురు ట్యాంకర్లు సముద్రంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ను ఢీకొట్టి పేలిపోయాయాయి. ఈ విషయాన్ని ఐఆర్జీసీ వెల్లడించింది. ‘కొద్దిసేపటి క్రితం హర్మూజ్లో ముందుపాతరలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయి’ అని ఐఆర్జీసీ ప్రకటించింది. అదేవిధంగా ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో నాలుగు నౌకలను కూడా తాము అడ్డుకున్నామని తెలిపింది.
మరోవైపు ఏడోరోజు కూడా ఇరాన్పై దాడులు కొనసాగాయి. దాంతో దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరో రెండు, మూడు రోజులు ఇలాగే దాడులు కొనసాగితే తాము పూర్తిస్థాయి ఘర్షణకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ‘మేము దీటుగా స్పందిస్తాం. ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు’ అని పేర్కొన్నది. అన్నట్టే యూఎస్ స్థావరాలు లక్ష్యంగా చేస్తున్న ప్రతీకార దాడులను ఇరాన్ కొనసాగిస్తున్నది. తాజాగా కువైట్, జోర్డాన్పైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.