Iran War : అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ తమ గగనతలంలో కూల్చిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉంటారు. వారిలో ఒకరిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. మరో పైలట్ తప్పించుకున్నాడు. అతడి ఆచూకీ మాత్రం తెలియడం లేదు. దీంతో ఆ పైలట్ ఆచూకీ కోసం ఇరాన్ దళాలు గాలిస్తున్నాయి. అంతేకాదు, స్థానిక ప్రజలు కూడా పైలట్ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆర్మీ, స్థానిక ప్రభుత్వాలు భిన్నంగా స్పందించాయి.
అమెరికన్ పైలట్ కనిపిస్తే బంధించాలని, లేదా చంపాలని స్థానిక గవర్నర్ సూచించారు. పైలట్ను పట్టుకున్నా, చంపినా వారికి భారీ నజరానా అందిస్తామని గవర్నర్ ప్రకటించాడు. మరోవైపు ఇరాన్ ఆర్మీ మాత్రం భిన్నంగా స్పందించింది. తమకు పైలట్ పట్టుబడితే అతడిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ ఖైదీగా పరిగణించి తగిన గౌరవం అందిస్తామని ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో కీలక ప్రకటన చేసింది. అమెరికన్లకు ఇరాన్ దళాలకన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రమాదకరమని ఇరాన్ వ్యాఖ్యానించింది. ‘‘ఇరాన్ కస్టడీలో ఉండటం కన్నా డొనాల్డ్ ట్రంప్తో ఉండటమే మీ పిల్లలకు చాలా ప్రమాదకరం. అందుకే, ఆ పైలట్ అమెరికా రెస్క్యూ టీమ్స్కు పట్టుబడటంకన్నా, ఇరాన్కు దొరకాలని కోరుకోండి. ముస్లింలుగా, నాగరికత తెలిసిన ఇరానియన్లుగా బంధీలను ఎలా గౌరవంగా, మర్యాదగా చూసుకోవాలో మాకు తెలుసు’’ అని ఇరాన్ ప్రకటించింది.
అలాగే, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా దీనిపై ప్రకటన చేసింది. యుద్ధ ఖైదీలను తాము అమెరికా మిత్రదేశాలైన జియోనిస్టులలాగా చూడబోమని చెప్పింది. అమెరికాలాగా, రాతియుగం నాటి పద్ధతులు కాకుండా, నాగరిక విధానాలు తమకున్నాయని ఇరాన్ తెలిపింది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాల్ని ఇరాన్ శుక్రవారం కూల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో ఒక పైలట్ తప్పించుకోగా, ఇంకో పైలట్ జాడ తెలియడం లేదు. అతడి కోసం ఇటు ఇరాన్, అటు అమెరికా కూడా వెతుకుతున్నాయి.