బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ జోరుగా నడుస్తున్నది. రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు పోటీపడి ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. దేశంలోని ఎనిమిది పాత ఫ్రాంచైజీలు, రెండు కొత్త ఫ్రాంచైజీలు.. మొత్తం 10 ఫ్రాంచైజీలు బిడ్డింగ్లో పాల్గొంటున్నాయి. ఇక దిగ్గజ ఆటగాళ్ల కోసమే పదుల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి.
నిన్నటి వేలంలో ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీపక్ చాహర్ను చెన్నై సూపర్కింగ్స్ యాజమాన్యం రూ.14 కోట్లకు దక్కించుకుంది. ఇక ఇవాళ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రూ.11.50 కోట్లకు సొంతం చేసుకున్నది. అజింక్య రహానేను కోల్కతా నైట్ రైడర్స్ బేస్ ప్రైజ్ అయిన రూ.కోటికి దక్కించుకుంది.
రెండు రోజుల వేలంలో ఇవాళ్టి లంచ్ బ్రేక్ వరకు మొత్తం 123 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు. వారిలో 96 మంది స్వదేశీ ఆటగాళ్లు, 27 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వారి కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.442.05 కోట్లను వెచ్చించాయి. ఇవాళ లంచ్ బ్రేక్ వరకు మొత్తం 22 మంది ఆటగాళ్ల వేలం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
కాగా, ఈసారి ఐపీఎల్ వేలానికి మొత్తం 590 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. వారిలో 123 మంది ఇప్పటికే అమ్ముడుపోగా.. మిగిలిన వారి కోసం వేలం కొనసాగుతున్నది. ఇదిలావుంటే ఇప్పటికే అన్ని జట్లు కలిపి 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ 25 మంది ఆటగాళ్లను (రిటైన్ చేసుకున్నవాళ్లతో కలిపి) ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది.