క్యూ2లో రూ.6,360 కోట్ల లాభం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,360.50 కోట్ల నికర లాభం లేదా ప్రతిషేరుకు రూ.6.93 ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,227.31 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.6.78తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో నమోదైన రూ.5,941.37 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గత త్రైమాసికంలో సంస్థ 19 మిలియన్ టన్నుల చమురును విక్రయించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 46% ఎగబాకి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5 లేదా 50 శాతం మధ్యంతర డివిడెండ్ను ఐవోసీ బోర్డు ప్రతిపాదించింది.