మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27: రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ-సీశాట్ 2025 పరీక్ష కోసం 2024-25 విద్యా సంవత్సరంలో వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లానాయక్ బుధవారం ప్రకటనలో తెలిపారు. శిక్షణకు రిజర్వేషన్ల ప్రకారం మహిళా అభ్యర్థులకు 33.33శాతం సీట్లు, దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ మైనార్టీ స్టడీసర్కిల్లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షలలోపు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా http://tmreistelangana. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇతర వివరాల కోసం 040-23236112 నంబర్కు సంప్రదించాలని సూచించారు.