హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మరో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు పెంచింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. 36 కేజీబీవీల్లో ఇంటర్ స్థాయి వరకు పెంచినట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూపులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 475 కేజీబీవీలు ఉండగా.. ఇప్పటికే ప్రభుత్వం 172 విద్యాలయాల్లో ఇంటర్స్థాయి వరకు పెంచినట్లు వివరించారు.