న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఇక నుంచి వృద్ధికంటే ద్రవ్యోల్బణంపైనే తమ దృష్టి ఉంటుందని ఇటీవల ప్రకటించిన రిజర్వ్బ్యాంక్ జూన్లో వడ్డీ రేట్ల పెంపును ప్రారంభిస్తుందన్న అంచనాలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఇంతకుమునుపే కొన్ని రేటింగ్ ఏజెన్సీలు, బ్రోకరేజ్ సంస్థలు ఈ అంచనాల్ని వెలువరించగా, జూన్ సమీక్షలో ఆర్బీఐ కనీసం 25 బేసిస్ పాయింట్ల (పావుశాతం) మేర రెపో రేటును పెంచుతుందని తాజాగా ఎస్బీఐకి చెందిన ఎకోరాప్ నివేదిక పేర్కొంది. గతవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 4 శాతం వద్ద స్థిరంగా అట్టిపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ సమీక్షలో 25 బేసిస్ పాయింట్లు, ఆగస్టులో మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ వడ్డిస్తుందని, మొత్తంమీద ఈ రేట్ల పెంపు సైకిల్లో 75 బేసిస్ పాయింట్ల మేర అధికమవుతుందని అంచనా వేస్తున్నట్టు ఎస్బీఐ నివేదికలో వివరించారు. ఆహారోత్పత్తుల ధరలు కొండెక్కడంతో మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతానికి చేరిందని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం జోరందుకుందని బ్యాంకింగ్ దిగ్గజం తెలిపింది.