ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 25 : ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఊరు ఊరంతా ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ గ్రామస్తులు. ఈ గ్రామంలోని రైతులందరూ ఆరుతడి పంటలైన కూరగాయలు, ఆకుకూరలే సాగుచేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పాడి పరిశ్రమ చేపడుతూ.. ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. గ్రామంలోని రైతులు కొత్తిమీర, పుదీనా, మెంతి, పాలకూర, కొయ్యికూర, తోటకూర, బచ్చెలికూర, సుక్కకూరతో పాటు ఆలుగడ్డ, చామగడ్డ, టమాట, బీర, చిక్కుడు, కాకర, బెండతో పాటు పలురకాల ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. వీటిని ఇబ్రహీంపట్నంతో పాటు నగరంలోని ఎల్బీనగర్, మాదన్నపేట్తో పాటు పలు మార్కెట్లకు తరలించి మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు 200ఇండ్లు ఉంటాయి. అందులో 150వరకు రైతు కుటుంబాలున్నాయి. నగరానికి అతిచేరువలో ఉన్న తుర్కగూడ గ్రామంలో రైతులు ఎన్నో ఏండ్లుగా ఆకుకూరలు, కూరగాయలను సాగుచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరిలో చాలామంది ఆర్థికంగా స్థిరపడినప్పటికీ వ్యవసాయాన్ని మాత్రం మరువకుండా సాగుచేసుకుంటూ ప్రతిరోజూ మార్కెట్కు తరలించిన అనంతరం తమ పనులను చూసుకుంటుంటారు. ఈ రైతులందరూ ఆకుకూరలు, కూరగాయల సాగుపైనే అధిక దృష్టి సారించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఆకుకూరలు కేరాఫ్ తుర్కగూడ గ్రామంగా జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నది.
వంద మందికి పైగా సాగు..
తుర్కగూడ గ్రామపంచాయతీ విస్తీర్ణంలో చిన్నది. 200కుటుంబాలున్న ఈ గ్రామంలో 150కుటుంబాల వరకు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 100మంది రైతులు ఆకుకూరలు, కూరగాయల పంటలనే సాగుచేస్తున్నారు. ఎక్కువగా కొత్తిమీర, పుదీనా, మెంతి, పాలకూర, కొయ్యికూర, తోటకూర, బచ్చెలికూర, సుక్కకూరతో పాటు ఆలుగడ్డ, చామగడ్డ, టమాట, బీర, చిక్కుడు, కాకర, బెండ వంటి పంటలను సాగుచేస్తున్నారు. ఈ గ్రామంలో సాగు పనుల్లో ఇతర కూలీలు, జీతగాళ్లు లేకుండా కేవలం కుటుంబసభ్యులతో మాత్రమే పనులు చేసుకోవడం విశేషం.
ప్రతిరోజూ నగరానికి తరలింపు
గ్రామంలో రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను ప్రతిరోజూ ఇబ్రహీంపట్నంతో పాటు నగరంలోని పలు మార్కెట్లకు తరలిస్తారు. ఉదయం 5గంటలకు పొలంలోకి వెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కోసుకుని మార్కెట్కు తరలిస్తుంటారు. ముఖ్యంగా ఈ గ్రామంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది.
ఐదారేండ్ల క్రితమే ఆరుతడి పంటలపై దృష్టి..
గ్రామంలో రైతులు ఐదారేండ్లుగా తమ ఇంటి అవసరాల మేరకు వరిపంటను సాగుచేసుకుంటూ ఇతర కూరగాయలు, ఆకుకూరల పంటలపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో తుర్కగూడ గ్రామం యావత్ జిల్లా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతిరైతు వరిని మరిచి ఆరుతడి పంటలతో పాటు కూరగాయలను సాగుచేయాలని అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతిరోజూ ఆకుకూరలను నగరానికి తరలిస్తాం
పదేండ్లుగా ఆకుకూరలు, కూరగాయల పంటలనే అధికంగా సాగుచేస్తున్నా. ప్రతిరోజూ పొలంలో సాగుచేసిన ఆకుకూరలు, కూరగాయలను నగరంలోని మాదన్నపేట్, ఎల్బీనగర్తో పాటు ఇబ్రహీంపట్నం మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటాం. ఆకుకూరలు, కూరగాయల సాగుకు పని ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి లాభాలు గడిస్తున్నాం. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగుచేస్తున్నాం.
ఏడాదంతా సాగుచేస్తా
నాకున్న రెండెకరాల పొలంలో మా ఇంటి అవసరానికి అర ఎకరం పొలంలో వరిపంట సాగుచేస్తా. మిగతా ఎకరంన్నర పొలంలో పాలకూర, కొయ్యికూర, పుంటికూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు సాగుచేస్తా. మాకు కూలీలు, జీతగాళ్లు అవసరం లేకుండా నేను, నా భార్య ఉదయాన్నే పొలానికి వచ్చి ఆకుకూరలు కట్టలు కట్టి నగరానికి తరలిస్తాం. గత ఐదేండ్లుగా ఆకుకూరలు, కూరగాయల పంటలే సాగుచేస్తున్నా.