కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లు మరో మూడునెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ (Integrated Markets) నిర్మాణ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలసి పరిశీలించారు. వాటి పనుల పురోగతిని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సమీకృత మార్కెట్ల ఏర్పాటుతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు, ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. నగరప్రజల కోసం రూ. 40 కోట్లతో సమీకృత మార్కెట్లు (Integrated Markets) సకలహంగులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ వాసులకు నాణ్యమైన, పరిశుభ్రమైన వాతావరణంలో పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఒకేచోట అందుబాటులో ఉంచే లక్ష్యంతో నగరం నలుమూలల వీటిని నిర్మిస్తోందని అన్నారు. ఒక్కో దానికి రూ. 10 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు.
నగరవ్యాప్తంగా రోడ్లమీద 3వేల మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారందరికీ సమీకృత మార్కెట్లలో అవకాశం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) సూచనల మేరకు సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు నేతి రవి వర్మ, నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.