ధర్మారం, మే20 : తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామంలో మంత్రి ఈశ్వర్ పర్యటించారు. రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.50 లక్షల నిధులతో చేపట్టే శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో సమైక్యాంధ్ర పాలనలో గ్రామాలు నిరాదరణకు గురయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమతో సమగ్ర అభివృద్ధి జరిగి గ్రామాల రూపురేఖలు మారాయని ఆయన వివరించారు.
పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని, బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో ఇలాంటి ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పీ చైర్మన్ పూస్కురు పద్మజ, గ్రామ సర్పంచ్ జనగామ అంజయ్య, ఎంపీటీసీ జనగామ లక్ష్మి, బలరాం రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.